
హైదరాబాద్లో చాప కింద నీరులా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కార్యకలాపాలు తిరిగి సాగుతున్నాయా? ఇదివరకే అరెస్టయిన కొందరు ఉగ్రవాదులు వేరే నెట్వర్క్తో పని చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ నుంచి అవుననే సమాధానాలు వస్తున్నాయి. హెదరాబాద్లో ఐసిస్ మళ్లీ తన ఉనికిని చాటుకుందని తాజాగా స్పష్టమైన నేపథ్యంలో...ఈ వార్తలు తెరమీదకు వస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో జాతీయ దర్యాప్తు బృందం సోదాలు నిర్వహించి ఇద్దరిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో.... ఈ చర్చ జరుగుతోంది.
పాతబస్తీలోని షాహిన్ నగర్, పహాడీ షరీఫ్ లో కర్నాటక, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన రెండు NIA బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు అబ్దుల్ అనే వ్యక్తితో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. మరికొంత మందిని విచారిస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. షాహిన్నగర్లోని అబ్దుల్ ఖదీర్(19) ఇంట్లో సోదాలు చేశారు. 2016లో ఢిల్లీలో పట్టుబడ్డ వారితో అబ్దుల్ ఖదీర్కు సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరో వ్యక్తిని వరంగల్ జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు. 55 ఏళ్ల ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తుల నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు కూడా ప్రచారం జరుగుతుంది.
ఆదివారం ఢిల్లీలోని ఎయిర్పోర్టులో సౌదీ నుంచి వచ్చిన హబీబుల్ రెహ్మాన్ అలియాస్ హబీబ్ ఓ వ్యక్తిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఒరిస్సాకి చెందిన ఈ వ్యక్తి కొన్నాళ్లుగా సౌదీలో నివాసం ఉంటున్నారు. ఇతనికి లష్కరేతోయిబాతో సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ నిర్ధారించింది . అతన్ని విచారించిన క్రమంలోనే హైదరాబాద్ పాతబస్తీలో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. కాగా, పాతబస్తీలోని పహాడీ షరీఫ్, హఫీజ్బాబానగర్లో తనిఖీలు నిర్వహించడంపై ఎన్ఐఏ బృందం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
SOURCE:GULTE.COM