
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ‘బాహుబలి’ తర్వాత తమ హీరో నుంచి పెద్దగా అప్ డేట్లే లేకపోయాయి.‘సాహో’ సినిమాను అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్.. చిన్న టీజర్ మాత్రమే వదిలారు. దాదాపు ఏడాది నుంచి అసలే విశేషాలనూ చిత్ర బృందం అభిమానులతో పంచుకోలేదు. ఐతే ఎట్టకేలకు చిత్ర బృందం ప్రభాస్ ఫ్యాన్స్కి ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయినట్లు సమాచారం. ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. ఆ రోజు ‘సాహో’ ఫుల్ లెంగ్త్ టీజర్ రిలీజ్ చేస్తారట.
దుబాయిలో తీసిన భారీ యాక్షన్ ఘట్టాల తాలూకు విజువల్స్ ఈ టీజర్లో ఉంటాయని.. టీజర్ యాక్షన్ ప్యాక్డ్ గా.. చాలా స్టైలిష్ గా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం సమకూరుస్తున్నారు.
విశేషం ఏంటంటే.. ప్రభాస్ పుట్టిన రోజుకు యువి క్రియేషన్స్ ఇంకో కానుక కూడా ఇవ్వబోతోందట. ఈ సంస్థలోనే ప్రభాస్ మరో సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణకుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రం కూడా ‘సాహో’తో పాటే యూరప్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ‘అమూర్’ అని.. ‘జాన్’ అని టైటిళ్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ చిత్ర టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ను ప్రభాస్ పుట్టిన రోజుకే రిలీజ్ చేస్తారంటున్నారు. అంటే ఒకే రోజు ప్రభాస్ ఫ్యాన్స్కి డబుల్ ధమాకా ట్రీట్ అన్నమాట. ఇదే నిజమైతే అభిమానుల ఆనందానికి అవధులుండవు.
SOURCE:GULTE.COM